పురపోరు
2026
………………………
ఆదిలాబాద్ .. చరిత్ర ఘనం
గడ్డకట్టే చలిలో.. వేడిపుట్టిస్తున్న రాజకీయాలు
మునిసిపల్ పీఠంపై ప్రధానపార్టీల కన్ను
గతంలో బీఆర్ఎస్ సొంతం
ఈసారి అధికార కాంగ్రెస్ కు అవకాశాలు అధికం
రిజర్వేషన్లపై టెన్షన్
(మహా ప్రత్యేకం, ఆదిలాబాద్)
ఆదిలాబాద్ పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్యమైన స్థానిక స్వపరిపాలన సంస్థ.
ఈ పురపాలక సంఘం 1956 సంవత్సరంలో ఏర్పడగా, 1998లో మొదటి తరగతి మునిసిపాలిటీగా అప్గ్రేడ్ చేయబడింది. జిల్లా కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్ పట్టణమే దీనికి పరిపాలనా కేంద్రం. ఆదిలాబాద్ మునిసిపాలిటీ చరిత్ర ఎంతో ఘనమైనది. చరిత్ర పెద్దగా ఉన్నా.. అభివృద్ధిలో గత పాలకులు చిన్నచూపు చూశారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.
విస్తీర్ణం
పురపాలక పరిధి విస్తీర్ణం: 50.69 చదరపు కిలోమీటర్లు
జనాభా & ఓటర్ల గణాంకాలు
(తాజా సమాచారం ప్రకారం)
మొత్తం ఓటర్లు: 1,43,773
పురుష ఓటర్లు: 69,869
మహిళా ఓటర్లు: 73,898
పురుషుల కంటే మహిళలు: 4,029 మంది అధికం
వార్డులు
మొత్తం వార్డుల సంఖ్య: 49
పరిపాలన నిర్మాణం
మున్సిపల్ కమిషనర్: సీవీఎన్ రాజు
మొత్తం ఉద్యోగులు: 40 మంది
మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఆదిలాబాద్ పురపాలిక లో ఇప్పటినుండే పలు రాజకీయ పార్టీలు ఆశావహులు పావులు కదుపుతున్నారు. పట్టణంలో ఎవరిని కదిపినా మున్సిపల్ చర్చే నడుస్తోంది. దీంతో అత్యంత చలి వాతావరణంలో సైతం ఎన్నికల ఆలోచనలు వ్యూహాలతో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులలో ఎన్నికల వేడి నెలకొంది. ఇప్పటికే గత ఎన్నికల్లో చైర్మన్ పీఠం దక్కించుకున్న జోగు ప్రేమేందర్ తో పాటు ఆయా వార్డులలో గెలిచిన మాజీ కౌన్సిలర్లు సైతం మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనే ఆలోచనలో ఉన్నారు.అయితే కొద్ది నెలల క్రితమే కొందరు పార్టీలు మారారు. ఇక వీరితో పాటు గతంలో ఓడిన వారు మరో ప్రయత్నంగా బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక కొత్తవారు బరిలోనిలిచే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటినుండే పోటీపై వ్యూహాలు ప్రతివ్యూహాలు సమాలోచనలు పైరవీలతో మున్సిపల్ సీన్ గరంగరంగా కనిపిస్తోంది.
పోటా పోటీ
మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులుండగా గత ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలిచి బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అనంతరం 2023లో జరిగిన శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో ఆ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలున్నా బీఆర్ఎస్ బీజేపీలు గట్టి పోటీనిచ్చే అవకాశం కనబడుతోంది.ఇప్పటి నుండే వార్డుల వారీగా ఆశావహులు తమ అభ్యర్థిత్వం పై ఆయా పార్టీల పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఫెర్మామెన్స్ వార్డుల్లో తమ బలాబలాలు వివరిస్తూ టికెట్ కై పైరవీలు సాగిస్తున్నారు.ఒక వేళ ఆయా పార్టీలు టికెట్ నిరాకరిస్తే సొంతంగా తమ సత్తా చాటేందుకు కూడా వెనుకాడని పరిస్థితి నెలకొంది.
రిజర్వేషన్ పై దృష్టి
బల్దియాలో పోటీకి వార్డులు వారీగా చాలా మందే ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. అయితే రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావాలని ఆశిస్తున్నారు..ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాతనే రిజర్వేషన్లు వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ తో పాటు వార్డులకు రిజర్వేషన్ కలిసొస్తే తమ అదృష్టం పరీక్షించుకునేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారు. అటు మూడు ప్రధాన పార్టీలతో పాటు మిగతా రాజకీయ పార్టీలు సైతం ఎవరెవరిని పోటీలో నిలబెట్టాలా బలమైన అభ్యర్ధులు ఎవరా అని ఆలోచిస్తున్నాయి. అటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధుల కోసం కూడా దాదాపు పలు పార్టీలు ఇప్పటికే కొందరి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డెరెక్టుగా నిర్వహిస్తారనే ప్రచారం సొగుతోంది.అదే జరిగితే ఓటర్లు రెండు వేర్వేరు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉండనుంది.ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పలు సమావేశాల్లో చెప్పినట్టు ఈ సారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటారా ..?లేదా బీఆర్ఎస్ మరోమారు తన కుర్చీ కాపాడుకుంటుందా..? లేదా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. అటు గత ఎన్నికల మాదిరిగా పరోక్ష పద్ధతిలో చైర్మన్ గిరి ఎన్నిక జరిగితే మున్సిపల్ పీఠం దక్కాలంటే ఆయా పార్టీలు అత్యధిక స్థానాలలో తమ అభ్యర్ధులను గెలిపించుకోవలసి ఉంటుంది. మున్సిపల్ చైర్మన్ కుర్చీని ఆశిస్తున్న అభ్యర్ధి తన గెలుపుతో పాటు మెజారిటీ అభ్యర్దుల విజయానికి కూడా కృషి చేయాల్సి ఉంటుంది.
స్వతంత్రులు కీలక పాత్ర
మరోవైపు ఈ సారి బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని అటు రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెట్లు కూడా ఉవ్విళ్లూరుతున్నారు.అయితే ఏదైనా పార్టీ టికెట్ లేదా స్వతంత్రంగా బరిలో దిగేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల లో పార్టీ కంటే కూడా వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి 49 వార్డులలో కొన్ని వార్డులు ఇండిపెండెట్ల ఖాతాలోకి వెళ్లితే వారు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. లేదా అంతకు ముందే ఆయా పార్టీల అభ్యర్ధులు ఇండిపెండెంట్లను మచ్చిక చేసుకుని లైన్ క్లీయర్ చేసుకుంటారా అనేది కూడా ఆసక్తికరమే.
తుది జాబితా కు కసరత్తు
త్వరలో మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ వెలువడనుండడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ను ప్రారంభించింది. ఈనెల 1నుండి 5వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ను అందుబాటులో ఉంచింది. అయితే ఓటరు జాబితాలో తప్పులపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో ఆయా వార్డులలో సర్వే నిర్వహించి తుది జాబితా విడుదలకు అధికారులు సన్నద్దమవుతున్నారు.ముసాయిదా ఓటర్ జాబితాలో అవకతవకలను సరిచేసేందకు పై మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఓటరు వార్డుల తారుమారు, మరణించిన వారి పేర్లు జాబితాలో ఉండటం పై క్షేత్రస్థా యిలో సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. మృతుల పేర్లు తొలగిస్తూ మిగతా ఓటర్లు స్థానికంగా ఉంటున్నారా లేదా ఇంటి నంబర్లు, ఓటర్ ఎపిక్ కార్డు లను పరిశీలించి విచారించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు ఈనెల 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించేందకు కసరత్తు చేస్తోంది. అలాగే 16న తుది జాబితా విడుదల చేయనుంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణికుముదిని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్, అధికారుల యుద్ధప్రాతిపదిక చర్యలు చూస్తుంటే ఈనెల చివరి వారం కల్లా నోటిఫికేషన్ వెలువడే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పురపాలక స్వరూపం
ఆదిలాబాద్ పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. 1956 లో ఏర్పడి 1998లో మొదటి తరగతికి చెందిన మునిసిపాలిటీగా అప్ గ్రేడ్ చేయబడింది. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ పట్టణం దీనికి పరిపాలనా కేంద్రం. పురపాలక పరిధి విస్తీర్ణం 50.69 చదరపు కిమీటర్లు. తాజా గణాంకాల ప్రకారం ఆదిలాబాద్ మునిసిపాలిటీలో 1లక్షా43 వేల 773 మంది ఓటర్లు ఉండగా పురుషులు 69వేల 869 మంది. స్త్రీలు 73వేల 898 మంది. పురుషుల కంటే స్త్రీలు 4వేల 29 మంది అధికంగా ఉన్నారు. మొత్తం 49 వార్డులున్నాయి. మున్సిపల్ కమీషనర్ సీవీఎన్ రాజు తో కలిపి పురపాలికలోని అడ్మినిస్ట్రేషన్,ఎస్టాబ్లిష్ మెంట్, ఇంజినీరింగ్,రెవెన్యూ,హెల్త్ అండ్ సానిటేషన్,అకౌంట్స్,టౌన్ ప్లానింగ్, మెప్మా విభాగాలలో మొత్తం 40 మంది ఉద్యోగులు ప్రజలకు సేవలందిస్తున్నారు.









