గంగాధర జనవరి 21 : శివ భక్తుడైన మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా బుధవారం గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని ప్రసిద్ధ మార్కండేయ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణ వేడుకను వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిపారు. కల్యాణ మహోత్సవాన్ని దర్శించేందుకు గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, అనంతరం కల్యాణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. కల్యాణ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయని భక్తులు పేర్కొన్నారు.









