జగిత్యాల ఫిబ్రవరి 17 (నవ వెలుగు) : బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుపై జరిగిన దాడి రాజకీయ విద్వేషం, విష ప్రచారాల నేపధ్యమేనని ఇది అన్యాయమని బిజెపి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మెట్ పల్లిలో బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పై జరిగిన దాడిని బీజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొందరు నాయకులు యాదగిరి బాబు ఎదుగుదలను ఓర్వలేక, రాజకీయ విద్వేషంతో పుట్టించిన పుకార్ల మూలమే ఈ దాడికి కారణమన్నారు. మున్సిపల్ బిజెపి కౌన్సిలర్లకు విప్ జారీ చేయలేదని కొందరు తప్పుడు ప్రచారాలు చేసి కొందరు కార్యకర్తలను ఉసిగొల్పి పార్టీ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేయించడం దుర్మార్గం అన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భవిష్యత్ లో మరోసారి ఇలాంటి సంఘటన జరుగకుండా చర్యలు ఉండాలని తిరుపతి డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను బిజెపి పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కొందరు నాయకులు తమ స్వార్థం కోసం ఇతర పార్టీలకు ఓటేస్తే జిల్లా అధ్యక్షున్ని నిందించి వారిపై దాడి చేయడం అన్యాయం అని నలువాల తిరుపతి అన్నారు.









